- రూ.34 కోట్లతో నేతన్నలకు లక్ష రూపాయల రుణమాఫీ పూర్తి
- నేతన్న జీవనోపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేకంగా 900 కోట్ల ఆర్డర్లు
- అపెరల్ పార్క్లో మరో పరిశ్రమ యూనిట్ను ప్రారంభించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,
Minister Tummala Nageswara Rao: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 11 (మన బలగం): నేతన్నలు, రైతన్నల సంక్షేమమే ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్లో 7.6 ఎకరాల విస్తీర్ణంలో, రూ.62 కోట్లతో, లక్షా 73 వేల చదరపు అడుగుల పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ (టెక్స్ పోర్ట్) యూనిట్ను శుక్రవారం చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao), పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu), బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government Whip Aadi Srinivas), జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ (Collector Sandeep Kumar Jha)లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమ శిలా ఫలకాన్నీ ఆవిష్కరించారు. యూనిట్లోని ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం యూనిట్లోని ఉద్యోగులతో ముచ్చటించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, నేతన్నల జీవనోపాధి కల్పించే విధంగా సిరిసిల్ల గడ్డ మీద వర్కర్ టూ ఓనర్, అపెరల్ పార్క్ ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. రైతన్నలు, నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, వీరిని దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పిస్తూ రాష్ట్ర యువతకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. 20 వేల 600 కోట్ల రూపాయల రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, నేతన్నలకు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా 34 కోట్ల రూపాయలతో లక్ష రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. నేతన్నలకు పెండింగ్లో ఉన్న 914 కోట్ల బకాయిలు విడుదల చేశామని తెలిపారు.
ఒకే రోజు వివిధ పథకాల కింద 290 కోట్ల నిధులు జమ చేసామని, చేనేత భరోసా, చేనేత బీమా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖలలో అవసరమైన వస్త్రాలను చేనేత కార్మికుల ద్వారానే కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటికే కార్మికులకు 900 కోట్ల రూపాయల ఆర్డర్స్ ప్రభుత్వం అందించిందని అన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే వర్కర్ టు ఓనర్ కార్యక్రమం పునరుద్ధరిస్తామని అన్నారు. చేనేత రంగానికి చెందిన పరిశ్రమలను సిరిసిల్ల, వరంగల్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న చేనేత కార్మికులు తిరిగి వచ్చేలా మౌలిక వసతుల కల్పన కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఏ పని చేసినా తెలంగాణ ప్రజల కష్ట ఫలితం మాత్రమేనని అన్నారు. కేంద్రాన్ని పోషించే రాష్ట్రాలలో తెలంగాణ మందు వరుసలో ఉంటుందని అన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గత కాంగ్రెస్ హయాంలో నేతన్నలు కాపాడేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. నేతన్నలకు అంత్యోదయ కార్డులను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. టెక్స్ పోర్ట్ సంస్థ ప్రతినిధులతో చర్చించి వారికి ఉన్న సమస్యలను పరిష్కరించి నేడు ఈ పరిశ్రమను ప్రారంభించామని అన్నారు. సిరిసిల్ల నేతన్న లకు దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.
వేములవాడ దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించామని అన్నారు. శాతవాహన విశ్వ విద్యాలయాన్ని తమ ప్రభుత్వం స్థాపించిందని, దీనికి సంబంధించి ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాలలను మళ్లీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నీటి పారుదల సౌకర్యం, రహదారుల సౌకర్యం, విద్యా, వైద్య సౌకర్యాలు కల్పనకు కృషి చేస్తున్నామని, అన్ని రంగాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతామని అన్నారు. స్థానికులకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించే ఇటువంటి పరిశ్రమకు భవిష్యత్తులో ఎటువంటి అవసరమున్న ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని అన్నారు.
బీసి సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, బెంగళూరు నగరానికి చెందిన టెక్స్ పోర్ట్ సంస్థ అప్పెరల్ పార్క్లో 62 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషమని, భవిష్యత్తులో పరిశ్రమ విస్తరణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, టెక్స్ పోర్ట్ సంస్థ ఇక్కడ మరింత విస్తరించాలని, స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలలో అవసరమైన బట్టలను చేనేత కార్మికుల నుంచి సేకరిస్తున్నామని, మహిళా సంఘాలకు ప్రభుత్వం రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించిందని వీటి ఆర్డర్లను కూడా సిరిసిల్ల నేతన్న లకే ప్రభుత్వం అందించిందని అన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సన్న బియ్యం పథకం అమలు చేస్తుందని వివరించారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, చేనేత కార్మికులకు లక్ష రూపాయల రుణ మాఫీ పూర్తి చేశామని, మహిళా సంఘాలలో ఉన్న 65 లక్షల మంది మహిళలకు ఉచిత 2 చీరలు పంపిణీ చేయాలనే నిర్ణయించి ఆ ఆర్డర్ ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ ప్రాంతంలో కాటన్ పరిశ్రమ, పాలిస్టర్ పరిశ్రమ, అనుబంధ రంగ పరిశ్రమలు తీసుకొని రావాలని, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆయన మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల చిరకాల కోరిక నూలు డిపోను కూడా వేములవాడ పట్టణంలో 50 కోట్లతో ఏర్పాటు చేసుకున్నామని, దీని వల్ల 99 సంఘాలకు ఇప్పటివరకు సబ్సిడీ పై నూలు అందించామని అన్నారు. అనంతరం పరిశ్రమలో శిక్షణ పొందిన మహిళలకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, కంపెనీ సీఈఓ చంద్రశేఖర్ ఎస్పీ మహేష్ బీ గీతే, సెస్ ఛైర్మెన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రాధా బాయ్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ రాఘవేందర్, ప్రజా ప్రతినిధులు ప్రజలు కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.