- తరలివస్తున్న భక్తులు
- ఒక రోజు ముందే కిటకిటలాడుతున్న రాజన్న సన్నిధి
- భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి
- జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 25 (మన బలగం): దక్షిణకాశీ క్షేత్రం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ మహాశివరాత్రి జాతర సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆలయ అధికారులు పలు సూచనలు చేశారు. క్యూ లైన్లు, కోడె మొక్కు లైన్, ధర్మగుండం, ప్రధానద్వారం, ప్రసాదం తయారీ కేంద్రాన్ని, అంబేద్కర్ కూడలిని పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పార్కింగ్కు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని వివరించారు. కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహశీల్దార్ మహేష్, ఈఈ రాజేష్, సీఐ వీరప్రసాద్, తదితరులు ఉన్నారు.