Presenting the cheque: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, జనవరి 22 (మన బలగం): బదిర విద్యార్థిని ఉన్నత విద్యాభ్యాసానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించింది. వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన దోమకొండ లహరి తండ్రి పోచయ్య. లహరి కరీంనగర్ జిల్లాలోని బధిరుల పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు ఆర్థిక స్థోమత లేక ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టిలోకి వచ్చింది. దీంతో ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థి వివరాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షా 40 వేల ఆర్థిక సహాయాన్ని సీఎం ఆర్ఎఫ్ సహాయం కింద పంపింది. మంగళవారం దోమకొండ లహరికి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెక్కు అందజేశారు. ఉన్నత విద్య అభ్యసించి అనుకున్న లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షించారు. తమ కూతురు చదువుకు ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం, సహకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు దోమకొండ లహరి తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.