Arrangements for Group-3 Examination: నిర్మల్, అక్టోబర్ 18 (మన బలగం): గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ టీజీపీఎస్సీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రూప్-3 పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్షకు సంబంధించి జిల్లా నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ వ్యవహరిస్తారని తెలిపారు. అన్ని జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్లను గుర్తించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో సరిపడినంత ఫర్నిచర్, విద్యుత్, ఇతర సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. టీజీపీఎస్సీ నిబంధనలకు లోబడి పరీక్షా కేంద్రాలను కేటాయించాలన్నారు. పరీక్ష నిర్వహణకు సరిపడినంత సిబ్బందిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. అధికారులు పరీక్షా కేంద్రాలను సందర్శించి అన్ని సౌకర్యాలు సరి చూసిన తర్వాతనే పరీక్షా కేంద్రాలకు అనుమతులివ్వాలని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, గ్రూప్-3 పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పకడ్బందీగా పరీక్షా కేంద్రాలను ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్త (పీజీ రెడ్డి) గంగారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.