Balashakti: నిర్మల్, డిసెంబర్ 6 (మన బలగం): బాలశక్తి కార్యక్రమాన్ని నిరంతరం పకడ్బందీగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాలశక్తి కార్యక్రమంపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాలశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, అన్ని రకాల పరీక్షలను నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో వ్యాధులను గుర్తించినట్లయితే వాటికి సంబంధించి మందులను సిఫారసు చేయాలని అన్నారు. వ్యాధులను నిర్ధారించడమే కాకుండా, నివారణకు కోసం మందులు, పోషకాలను తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థికి ఆరోగ్య కార్డులను తయారుచేసి, తల్లిదండ్రులకు వారి ఆరోగ్య స్థితిగతులను వివరించాలన్నారు. ఇప్పటివరకు విద్యార్థులకు నిర్వహించిన రోగ నిర్ధారణ పరీక్షలు, అందించిన పోషకాలు, మందుల గురించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆర్థిక అక్షరాస్యత మెరుగుపరిచేందుకుగాను బ్యాంకు అధికారులు క్షేత్రస్థాయిలో దశలవారీగా విద్యార్థులకు రోజువారి బ్యాంకు లావాదేవీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించు రుణాలు, సైబర్ నేరాలపై పరిజ్ఞానం పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. అన్ని పాఠశాలలో విద్యార్థులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, భారత ఎన్నికల విధానం వంటి విషయాలపై అవగాహన కల్పించేలా వ్యాసరచన పోటీలను నిర్వహించాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులచే నమూనా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బాలశక్తి కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఈఓ పి. రామారావు, డిఎంహెచ్ఓ రాజేందర్, డిఆర్డిఓ విజయలక్ష్మి, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, విద్య, వైద్యారోగ్య, శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.