- 45 శాతం ఓట్లతో ఘన విజయం
- కరీంనగర్లో కేసీఆర్, వినోద్ రికార్డులు బద్దలు కొట్టిన బండి
- 2.25 లక్షల మెజార్టీతో జయకేతనగం ఎగరేసిన సంజయ్
- రెండో స్థానం కోసమే పోటీపడ్డ కాంగ్రెస్, బీఆర్ఎస్
- కాంగ్రెస్కు 27.4, బీఆర్ఎస్కు 21.4 శాతం ఓట్లు
- అఖండ విజయంతో కరీంనగర్లో బీజేపీ కార్యకర్తల తీన్మార్
- బండి సంజయ్ అద్భుత విజయంతో సంబురాలు
- బండి సంజయ్ను భుజాలపైకి ఎత్తుకుని నడుస్తున్న కార్యకర్తలు
Bandy Sanjay: బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandy Sanjay) మరోసారి ప్రభంజనం సృష్టించారు. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో అత్యధిక ఓట్ల శాతాన్ని సాధించి టాప్ గేర్లో నిలిచారు. మొత్తం 13 లక్షల 3 వేలకుపైగా ఓట్లు పోలవగా, అందులో శాతం ఓట్లు సాధించడం గమనార్హం. తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థులందరి కంటే ఎక్కువ శాతం ఓట్లు సాధించడం విశేషం. మరోవైపు కరీంనగర్ (Karimnagar) పార్లమెంటు చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అత్యధిక మెజారిటీ సాధించారు. 2006 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు 2 లక్షల 1 వేయ్యి 581 ఓట్లు రాగా, 2014లో వినోద్ కుమార్కు 2 లక్షల 5 వేల 7 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఇవే అత్యధిక ఓట్లు. తాజా ఫలితాలతో బండి సంజయ్ ఆ రికార్డులను బద్దలు కొట్టి కరీంనగర్ చరిత్రలో మరో కొత్త రికార్డు నెలకొల్పారు. ఏకంగా 2 లక్షల 25 వేల 209 ఓట్లు సాధించి కరీంనగర్ ఆల్ టైం రికార్డును కైవసం చేసుకున్నారు.
ఇగ 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్కు 89 వేల 508 ఓట్ల మెజారిటీ కట్టబెట్టిన ప్రజలు ఈసారి అనూహ్యంగా అంతకలు మూడు రెట్లు ఓట్లు(2 లక్షల 25వేల పైచిలుకు ఓట్లు) కట్టబెట్టి తమ అభిమానాన్ని చాటుకోవడం విశేషం. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 లక్షల 97 వేల 150 మంది ఓటర్లుండగా, 13 లక్షల 3వేల 690 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఆరంభమైన ఓట్ల లెక్కింపులో భాగంగా పోస్టల్ బ్యాలెట్ కాకుండా మొత్తం 24 రౌండ్లు లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ సహా తొలి రౌండ్ నుండే బండి సంజయ్ ఆధిక్యత కనబర్చారు. మొత్తం 24 రౌండ్లకు గాను 22 రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో తొలుత వెనుకబడినప్పటికీ, క్రమేపి మెజారిటీ సాధిస్తూ వచ్చారు. అంతిమంగా 2 లక్షల 25 వేల 209 ఓట్లు సాధించి అఖండ విజయాన్ని అందుకున్నారు.
ఇగ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల విషయానికొస్తే, బండి సంజయ్ తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు రెండో స్థానం కోసం పోటీ పడాల్సిందేనంటూ పదేపదే చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్లుగా ఈ రెండు పార్టీల అభ్యర్థులు తొలి నుండి చివరి దాకా రెండో స్థానం కోసమే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడటం విశేషం. చివరిదాకా రెండు పార్టీలు పోటీ పడినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ 27.41 శాతం ఓట్లు(3,59,907 ఓట్లు) సాధించి రెండో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్ధి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ 21.49 శాతం ఓట్లతోనే (2,82163 ఓట్లు) సరిపెట్టుకోవడం విశేషం. వాస్తవానికి ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని యధేచ్చగా ఇంటింటికీ డబ్బు, మద్యాన్ని పంపిణీ చేసింది. అయినప్పటికీ బండి సంజయ్ విజయాన్ని ఏ మాత్రం అడ్డుకోలేకపోయాయి. ప్రజాతీర్పు ఏకపక్షంగా బండి సంజయ్ నే వరించడం గమనార్హం.
మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడగానే బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానుల ఆనందానికి ఆవధుల్లేకుండా పోయాయి. ఒకవైపు వర్షపు చిణుకులతో బండి సంజయ్ ను ఆశీర్వదిస్తున్న సమయంలో వేలాది మంది కార్యకర్తలు కరీంనగర్ వీధుల్లోకి తరలివచ్చి సంబురాలు చేసుకున్నారు. ఎస్సారార్ కాలేజీ వద్దకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ, తీన్మార్ డ్యాన్సులు వేస్తూ, బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. కొందరు కార్యకర్తలు బండి సంజయ్ ను భుజాలపైకి ఎత్తుకుని చిందులు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. కార్యకర్తల ఆనందోత్సవాలు, భారీగా తరలివచ్చిన సంజయ్ అభిమానులతో కరీంనగర్..జగిత్యాల రోడ్డు కిక్కిరిసిపోయింది.