CPI: కరీంనగర్, మార్చి 18 (మన బలగం): రానున్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేందుకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని, కరీంనగర్ కార్పొరేషన్లో గత పాలక వర్గం హయాంలో జరిగిన స్మార్ట్ సిటీ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలు జరిగాయని, వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించాలని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఐ కరీంనగర్ నగరంలోని సిపిఐ శాఖ కార్యదర్సుల సమావేశం పైడిపల్లి రాజు అధ్యక్షతన బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరిగింది. ఈ సందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ నగరంలోని 60 డివిజన్లలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త శాయశక్తుల కృషి చేయాలని ఆయన కోరారు. గతంలో పార్టీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని గత వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పని చేయాలని వాడల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలన్నారు. నగరంలో పేదలు ఇండ్లు లేక చాలామంది గుడిసెల్లో, కిరాయి ఇండ్లలో ఉంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పుతూ కాలం వెల్లదిస్తుందని వెంటనే ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
చాలామంది పేదలకు రేషన్ కార్డు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన కోరారు. నగరంలో ఇప్పటికీ చాలామందికి 500 రూపాయల గ్యాస్ పథకం అమలు కావడం లేదని, 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీ కూడా అమలు జరగడంలేదని అర్హులైన పథకాలు అందని ప్రజలందరినీ సమీకరించి భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. నగరంలో ఎక్కడ చూసినా రోడ్లు,పుట్ పాత్ లు అక్రమలకు గురవుతున్నాయని మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలొ పూర్తిగా విఫలం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం పలు రోడ్లలో శంకుస్థాపనలు చేసిందని ఏళ్లు గడుస్తున్న వాటికి నిధులు రాక మధ్యలోనే ఆగిపోయాయని వెంటనే ఆగిపోయిన పనులన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. సమావేశంలో శాఖ కార్యదర్శులుపైడిపల్లి రాజు, కిన్నెర మల్లమ్మ,న్యాలపట్ల రాజు,నలువాల సదానందం, సాయివేణి రాయమల్లు, చెంచలమురళి, కసి బోజుల సంతోష్ చారి, గామినేని సత్తయ్య, టి.సదయ్య, జి. సాంబరాజు, టీ. సంపత్ తదితరులు పాల్గొన్నారు.