Jagittala MLA Sanjay: జగిత్యాల, డిసెంబర్ 16 (మన బలగం): జగిత్యాలకు నవోదయ పాఠశాలను తెచ్చి ఎనిమిదేండ్ల ఈ ప్రాంత ప్రజల కల నెరవేర్చారని, అలాగే మరిన్ని నిధులిచ్చి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎంపీ అర్వింద్ను కోరారు. వివిధ పనులకు రాజస్థాన్, ఢిల్లీ వెళ్లిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పలువురు కేంద్ర మంత్రులతోపాటు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ను కలిసి పుష్ప గుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల ప్రాంత ప్రజల 8 ఏండ్ల ఆకాంక్ష మీ కృషితో నెరవేరిందని ఎంపీ అర్వింద్ను సంజయ్ కొనియాడారు. అలాగే జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం నుంచి నేషనల్ హైవే విస్తరణలో భాగంగా అంతర్గాం వద్ద బ్రిడ్జి, అండర్ పాస్ వే లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. రాయికల్ మండలం బోర్నపల్లి జగన్నాథ్పూర్ గ్రామాల మధ్యల బ్రిడ్జి నిర్మాణ అవసరం ఉందని, నిధులు కేటాయించాలని కోరారు.
జగిత్యాల నుంచి చలిగల్, సింగరావుపేట్ ఇటిక్యాల వెళ్లే జాతీయ రహదారిలో లో లెవెల్ వంతెనలు ఉండడం వల్ల వర్షాలు కురిసిన సందర్భంలో ప్రజల రాకపోకలకు, రవాణాకు ఇబ్బందిగా మారిందని, ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. నిజామాబాద్- జగదల్పూర్ జాతీయ రహదారి నేషనల్ హైవే అనంతారం గ్రామం వద్ద నూతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. జగిత్యాల నుంచి పోలాస రహదారిలో తిప్పన్నపేట పోలాస గ్రామాల మధ్యలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దానిని బ్లాక్ స్పాట్ రోడ్డుగా గుర్తించి నిధులు మంజూరు చేసి డివైడర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. జగిత్యాల నియోజకవర్గ బీర్పూర్ మండలంలో గిరిజన ఆదివాసి బంజారాల చాలా కుటుంబాలు వున్నాయని కోమన్ పల్లిలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే వినతి పత్రాన్ని ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వినతులపై సానుకూలంగా స్పందించిన ఎంపీ అర్వింద్ నిధుల మంజూరుకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.