- పట్టభద్రులు, టీచర్ల ఓటర్ నమోదు పెండింగ్ దరఖాస్తులను ఫిబ్రవరి 7 లోపు పరిష్కరించాలి
- ఎమ్మెల్సీ ఎన్నికలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన ఎన్నికల అధికారి
MLC Electoral Officer Pamela Satpathy: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి జనవరి 31 (మన బలగం): శాసన మండల సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని అదనపు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి పమేలా సత్పతి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రులు, టీచర్స్ శాసనమండలి సభ్యుల స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న స్క్రూట్ని, ఫిబ్రవరి 13 లోపు ఉపసంహరణ గడువు ఉంటుందని, ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని, మార్చి 3న ఫలితాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని, 24 గంటలు, 48 గంటలు, 72 గంటలలో తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్ట్ అందించాలని అన్నారు.
రాజకీయ పార్టీలకు సంబంధించిన హోల్డింగులు, గోడ రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అకౌంటింగ్ బృందాలు, ఎంసీసీ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్, వీ.ఎస్.టి, వీ.వి.టి మొదలగు బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు. మండలాల్లో ఈ రోజు వరకు ఓటర్ నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని, పెండింగ్ ఉన్న పట్టభద్రులు, టీచర్స్ ఓటర్ నమోదు దరఖాస్తులను ఫిబ్రవరి 7లోపు పరిష్కరించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్లు పరిశీలించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ సమయంలో ప్రచారానికి అవసరమైన అనుమతులను నిబంధనలను ప్రకారం జారీ చేయాలని అన్నారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను గుర్తించాలని తెలిపారు. బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని, ఎన్ని జంబో బ్యాలెట్ నార్మల్ బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో సరి చూసుకోవాలని అన్నారు. టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో పట్ట భద్రులకు సంబంధించి 28 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 21 వేల 614 మంది ఓటర్లు, ఉపాధ్యాయులకు సంబంధించి 13 మండలాల పరిధిలో 874 మాది ఓటర్లు ఉన్నారని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళికు సంబంధించిన నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎన్నికల సిబ్బంది పాష రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.