- దారి తప్పిన గురువు..!
- విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన
- పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
- ఉపాధ్యాయునికి దేహశుద్ధి.. కప్పిపుచ్చుకునే ప్రయత్నం
- రెండేళ్లుగా భరిస్తున్న విద్యార్థులు
teacher Indecent behavior: నిర్మల్, ఫిబ్రవరి 2 (మన బలగం): పెడదారిన వెళ్తున్న విద్యార్థులను దారిలో పెట్టాల్సిన గురువు దారి తప్పాడు. తల్లి, తండ్రి, దైవం తర్వాత స్థానం గురువుదే. అటువంటి గురువులే దారి తప్పితే సమాజానికే ప్రమాదం. బడిలో పిల్లలను తన కన్న పిల్లల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన నిర్మల్ జిల్లా గాజుల నర్సాపూర్ హైస్కూల్లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన సమాజాన్ని తలదించుకునేలా చేసింది.
విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు ప్రతినిత్యం అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం, వెకిలి చేష్టలు చేయడం, వారి శరీరాలను తాకడం చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల నుంచి ఈ తతంగం కొనసాగుతూ ఉండగా విసిగిపోయిన ఆ చిన్నారులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పారు. ద్వంద అర్థాల మాటలతో విద్యార్థులను విసిగిస్తున్నట్లు సమాచారం. గత సంవత్సరం 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ విషయమై ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రధానోపాధ్యాయుడు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఏడు అదే పరిస్థితిని సదరు ఉపాధ్యాయుడు కొనసాగించాడు. నర్సాపూర్ అంజని తాండకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని లెక్కల మాస్టారు వెకిలి చేష్టలను భరిస్తూ వచ్చింది. ఈ ఏడు పదో తరగతిలోనూ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో తన తల్లిదండ్రులకు తెలిపింది.
కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు
కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని సదరు ఉపాధ్యాయుడిని విచారించగా దాటవేసే ప్రయత్నం చేశాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిని తీవ్రంగా మందలించి చేయి చేసుకున్నట్లు తెలిసింది. మరోసారి ఇలాంటి సంఘటనలు తలెత్తితే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు.
ప్రధానోపాధ్యాయుడి నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
ఉపాధ్యాయుల పనితీరు, ప్రవర్తన అనుక్షణం పరిశీలించాల్సిన ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నర్సాపూర్ హైస్కూల్లో ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం బయటకు రావడంతో ఎవరి స్థాయిలో వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడిని ఫోన్ ద్వారా సంప్రదించగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని చేతులు దులుపుకున్నాడు. కాగా ఈ విషయంపై జిల్లా విద్యా శాఖ అధికారి సీరియస్గా ఉన్నట్లు సమాచారం.
శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి
విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నర్సాపూర్ హైస్కూల్ లెక్కల మాస్టర్పై, ప్రధానోపాధ్యాయుడు పైశాఖా పరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. సదరు ఉపాధ్యాయుడు గతంలో పనిచేసిన బెల్తారోడా, బీరెల్లి గ్రామాల్లోనూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కలెక్టర్ కార్యాలయంలో సీసీగా పనిచేసే రాకేశ్ మరో వివాహిత మహిళతో పట్టుబడడం సంచలనం సృష్టించిన సంఘటనను ప్రజలు మర్చిపోకముందే మరో కీచక ఉపాధ్యాయుని వ్యవహారం వెలుగులోకి రావడం పట్ల ప్రజలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్..
ప్రభుత్వం తరఫున విద్యార్థినులకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్పై అవగాహన సదస్సులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పాఠశాలలో సదస్సులను నిర్వహించి విద్యార్థినులను చైతన్యం చేస్తున్న సమయంలోనే ఉపాధ్యాయుడు బ్యాడ్ టచ్ చేస్తూ అడ్డంగా దొరికిపోవడం కలవరానికి గురిచేస్తుంది. ఉపాధ్యాయ లోకానికే మచ్చ తెచ్చే ఇలాంటి గురువులను కఠినంగా శిక్షించాలని పలువు డిమాండ్ చేస్తున్నారు.