fake currency circulation: నిర్మల్, ఫిబ్రవరి 2 (మన బలగం): నిర్మల్ జిల్లాలో నకిలీ నోట్ల చలామణి ఘటన కలకలం సృష్టించింది. ఏది నకిలీ ఏది అసలు తెలియక వ్యాపారులు అయోమయానికి గురవుతున్నారు. అచ్చు అసలును పోలినట్టే నకిలీ నోట్లు ఉండడం వల్ల అసలు నకిలీకి తేడాను గుర్తించలేక వ్యాపారులు నష్టాలకు గురవుతున్నారు. రద్దీ ప్రాంతాలు, చిరు వ్యాపారులే టార్గెట్గా అక్రమార్కులు నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారు.
వైన్సుల్లో నకిలీ నోట్ల చలామణి
వైన్స్ల వద్ద రద్దీగా ఉన్న సమయాల్లో నకిలీ నోట్లను చలామణి చేసి మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ గిరాకీ ఉన్న సమయాల్లో వీరు నకిలీ నోట్లను ఇచ్చి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వీరి వద్దకు వచ్చిన నకిలీ నోట్లు కొన్ని ఇతర కొనుగోలుదారుల చేతికి వెళ్ళగా మరికొన్ని బ్యాంకుల్లో గుర్తించబడుతున్నాయి. దీంతో నకిలీ నోట్లు తీసుకొని మద్యం విక్రయించి నష్టపోయిన వారు లబోదిబో మంటున్నారు.
చిరు వ్యాపారులే టార్గెట్
నకిలీ నోట్ల చలామణి దారులు చిరు వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు. కూరగాయలు, చిల్లర వ్యాపారులు, హోటల్లు, పళ్ళ దుకాణాలను లక్ష్యంగా చేసుకొని నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారు. గిరాకీ అవుతుందని ఆనందంలో నకిలీ నోట్లను తీసుకొని తర్వాత నష్టపోయామని తెలిసిన సమయంలో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
నిర్మల్లో నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో ఖదీర్ అనే వ్యక్తి నకిలీ ఐదు వందల నోట్లను చలామణి చేస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించగా మరో వ్యక్తి ఉన్నట్టు తేలిందని అన్నారు. మహారాష్ట్రలోని పర్భనికి చెందిన సందీప్ నకిలీ నోట్ల వ్యాపారం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
