No power cuts in summer
No power cuts in summer

No power cuts in summer: సమ్మర్‌లో నో పవర్ కట్స్: జగిత్యాల ఎస్ఈ సాలియా నాయక్ 

  • డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా
  • ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు

No power cuts in summer: జగిత్యాల, డిసెంబర్ 24 (మన బలగం): గత ఏడాదిగా డిమాండ్ ఎక్కువగా ఉన్న కాలంలోనూ డీటీఆర్లపై పడిన భారం ఎంత ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా కొత్తగా 203 ట్రాన్స్‌ఫార్మర్లను అమర్చుతున్నామని, లోడ్ మేరకు 156 ట్రాన్స్‌ఫార్మర్ల కేపాసిటీ పెంచుతున్నామని జగిత్యాల ఎస్ఈ సాలియా నాయక్ తెలిపారు. మెరుగైన, నాణ్యమైన, విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా అందించడానికి 33 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్స్ వ్యవస్థను పటిష్టపరిస్తూ ప్రతి ఒక్క 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓవర్ లోడ్ ఉన్న 33 కెవీ, 11 కేవీ ఫీడర్లను గుర్తించి అందుకు అనుగుణంగా లోడ్ భారం తగ్గించడానికి లోడ్ బదలాయింపు చేస్తున్నామని తెలిపారు. తద్వారా లోడ్ భారం తగ్గి నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా అందించడానికి రింగ్ మెయిన్స్ వ్యవస్థను పటిష్ట పరుస్తున్నామన్నారు. అలాగే 11 కేవీ ఫీడర్లకు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఫీడర్ల ద్వారా విద్యుత్ వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు.

ప్రణాళిక బద్ధంగా నిర్దిష్టమైన కార్యాచరణ ద్వారా 33/11 కేవీ, 11 కేవీ ఫీడర్లలోని లోపాలను ముందుగానే గుర్తించి తగిన నిర్వహణ కార్యక్రమాలు చేపడుతూ అంతరాయాలు లేని విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ కార్యక్రమాలు చేపట్టి విద్యుత్ అంతరాయాలను గణనీయంగా తగ్గించామని తెలిపారు. 5959 ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణతోపాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడంతో ఓవర్ లోడ్‌తో జరిగే విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గించగలిగామని అన్నారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో ఓకే వీసీబీలపై రెండు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో గల 11 కేవీ ఫీడర్లను ప్రత్యేక కార్యాచరణ ద్వారా బే ఎక్సటెన్షన్ ప్రత్యేకమైన సర్క్యూట్ బ్రేకర్ వీసీబీతో వేరుచేయడంతో మరింత మెరుగైన విద్యుత్ సరఫరా వినియోగదారులకు అందుతుందని అన్నారు. గడచిన కాలానికి జరిగిన అంతరాయాలు (బ్రేక్ డౌన్ల)లను సాంకేతికంగా విశ్లేషించి, వాటి ఆధారంగా బ్రేక్ డౌన్ రెక్టిఫికేషన్ టీంలను నియమిస్తున్నామని వివరించారు. అత్యవసర సర్వీసులో భాగమైన ఆసుపత్రి, మెడికల్ కాలేజీలు, పోలీస్‌స్టేషన్లకు అత్యవసర పరిస్థితుల్లో, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వివిధ నిర్దిష్టమైన కార్యాచరణ ద్వారా, గత వేసవిలో ఎదుర్కున్న ఇబ్బందులను పరిగణాలకు తీసుకొని వచ్చే వేసవిలో వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన, విద్యుత్ సరఫరా అందించడానికి నిబద్దతతో టీజీఏన్పీడీసీఎల్‌లోని ప్రతి ఒక్క ఉద్యోగి కంకణ బద్ధులై పని చేస్తున్నామని ఎస్ఈ సాలియా నాయక్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *