Whip Laxman Kumar
Whip Laxman Kumar

Whip Laxman Kumar: భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి: ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

Whip Laxman Kumar: ధర్మపురి, మార్చి 6 (మన బలగం): ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయాన్ని గురువారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేసారు. అనంతరం ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించే స్థానిక బ్రాహ్మణ సంఘం పక్కన గల యాగశాల స్థలాన్ని ఆలయ అర్చకులు, అధికారులు మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేద పండితులు, అర్చకులు మరియు ఆలయ అధికారుల సలహాలు, అభ్యర్థనల మేరకు మొదటి సారి స్వామి వారి కల్యాణాన్ని దేవాలయం లోపల కాకుండా బయట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామి వారి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీళ్లు, మొబైల్ టాయిలెట్లు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఆగమశాస్త్రం, వేద పండితుల సూచనలు, సలహాల మేరకు, సమయానుకూలంగా కల్యాణాన్ని పూర్తి చేయాలని తెలిపారు. స్వామి వారి కళ్యాణం అనంతరం అట్టి స్థలం చుట్టూ కంచె వేసి కేవలం స్వామి వారి కళ్యాణం కొరకు మాత్రమే అట్టి స్థలాన్ని వినియోగించాలని, దానికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ఆలయ అర్చకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *