Transparent Cotton Procurement in Nirmal District – Collector’s Directives: పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా అవసరమైనా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధర (ఎంఎస్పీ) కింద తగిన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే పత్తి మార్కెటింగ్ సీజన్ 2025-26లో జిల్లా సగటు దిగుబడి అంచనాకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు.
ఈ కమిటీ మండలాల వారీగా పత్తి సాగు విస్తీర్ణం, అంచనా ఉత్పత్తి వివరాలు సేకరించి వాస్తవికంగా సగటు దిగుబడిని లెక్కించనుందని తెలిపారు. రాష్ట్ర సగటు కంటే 10శాతం మించితే ప్రత్యేక ధ్రువీకరణతో మాత్రమే ఆమోదం ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు సహకరించి కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. అనంతరం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, సీపీవో జీవరత్నం, ఏడీ మార్కెటింగ్ గజానన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, డీఎస్వో రాజేందర్, డీఎం సుధాకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
