- క్వింటాకు రూ.15 వేలు చెల్లించాలని రైతు ఐక్య వేదిక డిమాండ్
- నియోజకవర్గం నుంచి భారీగా తరలిరానున్న రైతులు
Turmeric farmers: జగిత్యాల ప్రతినిధి / ఇబ్రహీంపట్నం, మార్చి 10 (మన బలగం): ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధర రాకపోవడంతో పసుపు రైతులు కడుపు మండి నిరసనకు సిద్ధమయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మంగళవారం జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నారు. కనీసం పెట్టుబడులు రాక తీవ్రంగా నష్టపోతున్నామని, వ్యాపారులు, దళారులు ఒక్కటై తమను ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసినా, ప్రయోజనమేమీ కలగడం లేదని వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పసుపు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పసుపు పంటకు రూ.15 వేలకు పైగా మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డుకు నిధులు కేటాయించాలని, ప్రభుత్వమే పసుపు పంటను కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్యార్డు నుంచి పాత బస్టాండ్ వరకు మహాధర్న నిర్వహిస్తున్నట్లు రైతు ఐక్యవేదిక నాయకులు తెలిపారు. ధర్నాలో పార్టీలకతీతంగా రైతులు పాల్గొనాలని కోరారు. ప్రభుత్వాలకు తమ సమస్యలను తెలియజేసి, పసుపు పంటకు మద్దతు ధర లభించేలా ఉద్యమిద్దామని కోరారు. ఇప్పటికే జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ప్రచారం చేసి రైతులను సంఘటితం చేశారు.
మహాధర్నాతో ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలి: నల్ల రమేశ్ రెడ్డి, రైతు ఐక్య వేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వాలు దిగివచ్చి మద్దతు ధర చెల్లించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మెట్పల్లిలో జరిగే మహాధర్నాతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలి. పసుపు బోర్డుకు నిధులు కేటాయించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పసుపు రైతుల సమస్యలను పరిష్కరించాలి.
గత సంవత్సరంతో పోలిస్తె 5 వేలు తక్కువ: రాధారపు దేవదాస్, రైతు ఐక్యవేదిన నాయకులు

గత సవత్సరంతో పోలిస్తే పసుపు పంటకు భారీగా ధర దిగిపోయింది. గతంలో పసుపు సీజన్ విక్రయాలు చేస్తే 15 వేలు పలకగా, ప్రస్తుతం 10 వేలు మాత్రమే పోతుంది. గిట్టుబాటు ధర లేక పసుపు పంటలకు పెట్టిన పెట్టుబడి గగనంగా మారింది. ప్రభుత్వం ఆలోచన చెయ్యాలి.
నేటి మహాధర్నాను విజయవంతం చేయాలి

పసుపు రైతుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ నెల 11న తలపెట్టిన ఛలో మెట్పెల్లి పసుపు రైతు మహా ధర్నా విజయవంతం చెయ్యాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం జగిత్యాల మార్కెట్ యార్డ్లో రైతులను కలిసిన ఐక్య వేదిక నాయకులు మహా ధర్నాకు భారీగా తరలిరావాలని కోరారు. పసుపు బోర్డ్, పసుపు మద్దతు ధర కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసి పసుపు బోర్డ్ సాధించుకున్నా మద్దతు ధర విషయంలో పసుపు రైతు ఇంకా నలిగిపోతున్నాడన్నారు. పసుపు రైతుకు నేడు మార్కెట్లో పసుపు ధర క్వింటాల్కు పదివేలు కూడా రానటువంటి పరిస్థితుల్లో మరోమారు రైతులు పోరుబాట పట్టి రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మార్చ్ 11 రోజున చలో మెట్పెల్లి పసుపు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ ధర్నా ను విజయవంతం చేయాలని రైతు ఐక్య వేదిక నాయకులు కోరారు.