Private water tankers
Private water tankers

Private water tankers: మున్సిపల్ కరెంటుతో.. ప్రైవేటు ట్యాంకర్ల నీళ్ల దందా!

  • హౌసింగ్ బోర్డులో నిర్వాకం
  • పట్టించుకోని అధికారులు

Private water tankers: జగిత్యాల ప్రతినిధి, జనవరి 6 (మన బలగం): ప్రజల తాగు నీటి అవసరాల కోసం దశాబ్దాల క్రితం తవ్విన ఓ బావిలో మున్సిపల్ కరెంటును అందిస్తే ప్రైవేటు ట్యాంకర్లతో నీటిని దోపిడీ చేస్తూ సొమ్ము చేసుకొంటున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోని సంఘటన జగిత్యాలలో నెలకొన్న వైనం ఇది. జగిత్యాల హౌసింగ్ బోర్డు కాలనీలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటి దారిలో ఓ పురాతన భావి ఉంది. దశాబ్దాల క్రితం తవ్విన ఈ బావిలో పక్కనే ఏర్పాటు చేసిన పార్కు అవసరాల కోసం మున్సిపల్ ఆధ్వర్యంలో ఆ బావిలో మోటారును ఏర్పాటు చేసి విద్యుత్ సదుపాయాన్ని కల్పించింది. కేవలం మున్సిపల్ వాటర్ ట్యాంకులలో నీళ్లు నింపుకొనేలా, పార్కు అవసరాల కోసం ఈ బావి నీళ్లను వినియోగించుకొనేలా ఏర్పాట్లు జరిగాయి. ఇందుకు విరుద్ధంగా ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు ఈ బావి నుంచి ట్యాంకర్లలో నీళ్లు నింపుకొంటూ వ్యాపారాలను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ప్రతి రోజూ దాదాపు నాలుగు ప్రైవేటు ట్రాక్టర్లతో ట్యాంకర్ల నిర్వాహకులు రోజుకు పది ట్రిప్పుల నీటిని తోడేస్తూ వెయ్యి రూపాయల ఒక ట్యాంకర్ చొప్పున విక్రయిస్తున్నట్లు స్థానికులు అంటున్నారు. ఇలా రోజుకు దాదాపు పది ట్యాంకర్లకు పైగానే నీటిని తోడేస్తుండగా దీనికై అయ్యే కరెంటు ఖర్చు మున్సిపల్ ఖాతాలో చేరుతున్నట్లు తెలిసింది. ఇలా ప్రజా ధనం వృథా అవుతుండగా మున్సిపల్ అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు అనేక ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ దందా నడుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోక పోవడంతోనే ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల నిర్వాహకులది ఆడిందే ఆట పాడిందే పాట అన్న తంతుగా మారింది. ఇప్పటికైనా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించాలని, అలాగే అధికారులు స్పందించి నీటి దోపిడీని అరికట్టి ప్రజా ధనం వృథా కాకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *