CPI Karimnagar: కరీంనగర్, జనవరి 19 (మన బలగం): కరీంనగర్ నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తన్న మేయర్ సునీల్ రావు నిధులు ఎక్కడి నుంచి తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు ఒక సంయుక్త ప్రకటనలో మేయర్ను ప్రశ్నించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గం సమయం వారం రోజులు మాత్రమే ఉందనే ఉద్దేశంతో మేయర్ సునీల్ రావు పలు డివిజన్లలో విచ్చలవిడిగా శంకుస్థాపనలు చేస్తున్నారని వీటికి ఎక్కడి నుంచి నిధులు తెచ్చి పెడతారని ప్రజలను ఓట్ల కోసం తమ వైపు తిప్పించుకోవడానికి తప్ప ఈ పనులన్నీ నత్త నడక సాగుతాయని విమర్శించారు. రెండు సంవత్సరాల క్రితమే శంకుస్థాపనలై చాలా వీధుల్లో రోడ్లు, డ్రైనేజీలు మధ్యలోనే నిలిచిపోయాయని వాటిని పూర్తిచేసే శక్తి లేని పాలకవర్గ సభ్యులు ఇప్పుడు శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని 60 డివిజన్లలో చాలా మట్టుకు శాసనసభ ఎన్నికల ముందు కొబ్బరికాయలు కొట్టి పెండింగ్లో పెట్టివాటిని వదిలేసారని, ఏ ఒక్క పని కూడా ముందుకు సాగలేదని, చాలా రోడ్లు తవ్వి వదిలి వేయడం వల్ల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని వాటిని చేపించడం చేతగాని నాయకులు మళ్లీ చెప్పుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదని వారు అన్నారు.
గత సంవత్సర కాలానికి పైగా చాలా పనులు మధ్యలోనే నత్తనడకన సాగి ఆగిపోయాయని పదవీకాలం పూర్తవు తుందనే ఆతృతతో త్వర త్వరగా అన్ని డివిజన్లలో తిరుగుతూ శంకుస్థాపన చేయడం విచిత్రంగా ఉందన్నారు. వారు చేసే శంకుస్థాపనలు అన్ని మున్సిపల్ పాలకవర్గం అనుమతి పొందినవా లేవా అనే అనుమానాలు ప్రజలకు ఉన్నాయని వాటిని బహిర్గత పరచాలని వారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ప్రజల ముందుకు ఓట్ల కోసం ఈ శంకుస్థాపనలు చేస్తున్నారే తప్ప ఏ పని ముందుకు జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. మేయర్కు పలుమార్లు పలు సమస్యలపై విన్నవించిన రెండు సంవత్సరాల నుంచి ఏ ఒక్క పనిని చెయ్యలేదని అలాంటిది ఇప్పుడెలా అసాధ్యమవుతుందని వారు అన్నారు. మేయరే కొంతకాలం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరానికి నిధులు ఇవ్వడం లేదని ప్రెస్మీట్లు పెట్టి చెప్పిన సందర్భాలు ఉన్నాయని మరి ఇప్పుడు వీటికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. మేయర్కు చిత్తశుద్ధి ఉంటే తనహాయంలో చేసిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి పైడిపల్లి రాజు డిమాండ్ చేశారు.