Establishment of VCBs: ఇబ్రహీంపట్నం, మార్చి 1 (మన బలగం): ప్రస్తుతం జిల్లాలో చాలా సబ్ స్టేషన్లలో ఓకే 11 కేవీ ఫీడర్ బ్రేకర్పై రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫీడర్లు ఉండి, ఒక ఫీడర్లో ఏదైనా అవాంతరం ఏర్పడితే బ్రేకర్ ట్రిప్ కావడం వలన రెండు ఫీడర్లు విద్యుత్ సరఫరాలో అంతరాయానికి గురికావాల్సి వస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఫీడర్కు ఒక అంకితమైన వీసీబీలను ఏర్పాటు చేసేందుకు ఎన్పీడీసీఎల్ నడుం బిగించింది. అందులో భాగంగా శనివారం మల్లాపూర్ మండలం రాఘవపేట సెక్షన్ పరిధిలోని చిట్టాపూర్ గ్రామం 33/11కేవీ సబ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన నూతన బ్రేకర్ ప్రారంభించిన సందర్భంగా ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శాలియా నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 65 కొత్త వీసీబీలు, 29 బే-విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని అందులో సుమారు 15 పూర్తయ్యే దశలో ఉన్నాయని మిగతా బ్రేకర్లు ఏప్రిల్ 15 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. చిట్టాపూర్ లో నేటి నుండి వినియోగదారులు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా పొందుతారని తెలిపారు. కార్యక్రమంలో డీఈలు గంగారాం, రవీందర్, ఏడీఈ మనోహర్, ఏఈలు సంతోష్, అజయ్, సిబ్బంది సురేష్, శంకర్, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.