Mollamamba Jayanti: ఇబ్రహీంపట్నం, మార్చి 13 (మన బలగం): కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మామిడిపల్లి కృష్ణ కోరారు. గురువారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ గ్రామంలోని ఇబ్రహీంపట్నం చౌక్ వద్ద కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ రామాయణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన గొప్ప కవయిత్రి, కుమ్మర కుల ఆడపడుచు కవయిత్రి ముల్లమాంబ అని తెలిపారు. 16వ శతాబ్దానికి చెందినదని అన్నారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహిస్తున్నదని, కానీ రాష్ట్రవ్యాప్తంగా మొల్లమాంబ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కృష్ణ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సిరికొండ రాజన్న, ఉపాధ్యక్షుడు రాధారపు దేవదాస్, మెట్పల్లి డివిజన్ అధ్యక్షులు మరిపెల్లి శంకర్, ఇబ్రహీంపట్నం మండలం అధ్యక్షులు వెలిచాల శేఖర్, గోధుర్ గ్రామ శాఖ అధ్యక్షులు రాధారపు రాజేందర్, సంఘ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.