Telangana Building and Construction Workers Union: కరీంనగర్, జనవరి 2 (మన బలగం): భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ర్టక్షన్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక బద్ధం ఎల్లారెడ్డి భవన్లో తెలంగాణ బిల్డింగ్ కన్స్ర్టక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి తెలంగాణ బిల్డింగ్ కన్స్ర్టక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్, సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి వహిస్తోందని, వెంటనే పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నిరుపేద కార్మికులకు పనిముట్లతో సహాయ సహకారాలు అందించి లోన్లు వెంటనే కల్పించాలని, భవనిర్మాణ బోర్డులో యూనియన్ సభ్యులను ఇద్దరిని తీసుకోవాలని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. 50 సంవత్సరాలు నిండిన వారికి ఐదు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఓబీసీడబ్ల్యూ కార్డ్ నెంబర్ అయిన సంవత్సరం కాకుండా నమోదైన తేదీ నుంచే పథకాలు అమలు చేయాలని కోరారు. కేంద్ర కార్మిక చట్టాల్లో ఉన్న పెన్షన్, స్కాలర్షిప్, ఇండ్లు పనిముట్లలోలనూ కార్మికులకు వెంటనే అందించాలని, 55 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి 5000 పెన్షన్ ఇవ్వాలని, ఆరోగ్య పరీక్షల కోసం ఖర్చు చేసిన నిధుల దుబారాపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల గ్రామ, మండల, మహాసభలు నిర్వహించుకుని జిల్లా స్థాయి మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ కోశాధికారి ఎండీ రజాక్, కార్యవర్గ సభ్యులు బాలయ్య, కన్నం చంద్రయ్య, సదానందం పూదరిఒదయ్య, కమల్ పాషా, సురేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.