Ambedkar Jayanti: కరీంనగర్, ఏప్రిల్ 14 (మన బలగం): భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి సీపీఐ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చివేసి మత రాజ్యాంగాన్ని తీసుకురావడానికి బిజెపి, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఇతర మత సంస్థలు కుట్ర పన్నుతున్నారని, ఈ కుట్రలను ప్రజలు ప్రజాస్వామికవాదులు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కుల మతాలతో ఉన్న కుళ్ళునంతా ఎండగట్టాలని, భారతదేశ సమాజాన్ని పట్టిపీడిస్తున్న మనువాదాన్ని తగలబెట్టాలని అన్నారు. మనువాదం నుంచి విముక్తి పొందడమే మార్గమని, ఆ దిశగా నడిపించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కొయ్యడ సృజన్ కుమార్, టేకుమల్ల సమ్మయ్య, కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు కటికి రెడ్డి బుచ్చన్న యాదవ్, పిట్టల సమ్మయ్య, బూడిద సదాశివ, బ్రాహ్మణపల్లి యుగంధర్ నగర కార్యవర్గ సభ్యులు చెంచల మురళి, హేమంత్, నల్లగొండ శ్రీను, సత్యనారాయణ చారి సాంబరాజు,తిరుపతిరెడ్డి, జంగా కొమురయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.