Police Martyrs Commemoration Competitions: నిర్మల్, అక్టోబర్ 20 (మన బలగం): పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఆన్లైన్లో వ్యాసరచన పోటీల నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా అక్టోబరు 21 నుంచి 25వ తేదీ వరకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 21న ముధోల్, 22 ఖానాపూర్, భైంసా పోలీసు స్టేషన్లో, 23న లక్ష్మణ చాందలో, 24న నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో, 25న భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ నిర్వహిస్తామన్నారు. అందులో పోలీసు విధులు, పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాంకేతిక వినియోగం, షి టీం, భరోసా, సైబర్ సెక్యూరిటీ, ఆంటీ నార్కోటిక్ డ్రగ్, డాగ్ స్క్వాడ్ విభాగాల విధులు, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, పోలీసులు చేసిన ప్రతిభ, త్యాగాల వంటి విషయాలను వివరిస్తారన్నారు.
వ్యాసరచన పోటీలను రెండు కేటగిరిల్లో తన నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాసరచన పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటాయని తెలిపారు. ఇంటర్మీడియట్ స్థాయి వరకు మొబైల్ వాడకంలో విచక్షణ అనే అంశంపై, డిగ్రీపై స్థాయి విద్యార్థులు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చటంలో నా పాత్ర అనే అంశంపై పోటీలు ఉంటాయన్నారు. రాసిన వ్యాసాన్ని ఆన్లైన్లో https://forms.gle/iNv6Y5mSJjW8W1Uj7 గూగుల్ ఫామ్లో ఈ నెల 24లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు అభ్యర్థులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో బహుమతుల ప్రదానం జరుగుతుందని, ఈ ముగ్గురు అభ్యర్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సంపాదించాలని అన్నారు. పోలీసులకు మొదటి కేటగిరిలో కానిస్టేబుల్ అధికారి నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు సమాజంలో పోలీసు ప్రతిష్టను మెరుగుపరచడంలో నా పాత్ర అనే అంశంపై, రెండో కేటగిరిలో ఎస్ఐ స్థాయి నుంచిపై స్థాయి అధికారులకు ‘దృఢమైన శరీరంలో దృఢమైన మనసు’ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించబడతాయని తెలియజేశారు. అలాగే 23 న భైంసాలో, 25న నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిర కార్యక్రమాలు ఉంటాయన్నారు. యువకులు పెద్ద ఎత్తున ఈ రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేయాలని కోరారు. పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించబడుతుందని తెలిపారు.