- కడెం మీదుగా భారీ వాహనాలకు అనుమతులు
- హర్షం వ్యక్తం చేస్తున్న వాహనాల యజమానులు
- చిరు వ్యాపారులకు ఊరట
Tiger Zone Heavy Vehicle Transport Permission Telangana: నిర్మల్, ఆగస్టు 13 (మన బలగం): అబ్బ పులి అంటే తోక బారెడు అన్నచందంగా ఉంది మన అటవీ అధికారుల (Forest Department) తీరు.. చుట్టపు చూపుగా వచ్చిపోయే పులుల కోసం వాటి సంరక్షణ పేరుతో కఠినమైన ఆంక్షలు విధించారు.. కోట్లాది రూపాయలు వెచ్చించారు.. ఫలితం శూన్యం.. లక్షేట్టిపేట నుండి జన్నారం మీదుగా కడెం వరకు భారీ వాహనాల రాకపోకలకు నిషేధం (heavy vehicle ban) విధించారు.. కొన్ని గ్రామాలనే ఖాళీ చేయించారు.. పులుల సంరక్షణను కాదనలేదు.. కానీ ప్రజల అవసరాలు.. దూరభారాలు,ఆర్థిక భారాలను పరిగణలోకి తీసుకోవాలి.. కానీ అటవీ అధికారులు అవేమీ పట్టించుకోలేదు..
భారీ వాహనాలకు అనుమతులు
టైగర్ జోన్ పరిధిలోని నిర్మల్ _మంచిర్యాల్ జాతీయ రహదారిపై ఎట్టకేలకు భారీ వాహనాల రాక పోకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.వాహన యజమానులతో పాటు జన్నారం మండలం నాయకులు నెల రోజుల పాటు నిరాహార దీక్షలను చేపట్టారు.ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ సహకారం తోడవడం తో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.పుష్కర కాలంగా అడవి మార్గం(టైగర్ జోన్)గుండా నిలిచిపోయిన వాహనాల ప్రయాణం మొదలైంది.
తగ్గిన దూర భారం
టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాల రాక పోకలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం తో వాహన దారులకు భారీగా దూర భారం తగ్గింది.దీంతో సమయం తో పాటు ఆర్థిక భారం తగ్గనుంది.రవాణా నిషేధం ఉన్న సమయం లో నిర్మల్(Nirmal) వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలు జగిత్యాల్,ఆర్మూరు మీదుగా వెళ్లాల్సి ఉండేది.ప్రస్తుతం అనుమతులు లభించడం తో సుమారు 130 కిలోమీటర్ల వరకు దూరం తగ్గనుంది.దీంతో వాహన యజమానులు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిరు వ్యాపారులకు ఊరట
టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాలకు రవాణా అనుమతులు లభించడం తో చిరు వ్యాపారులకు ఊరట లభించింది.లక్షేటిపేట నుండి ఖానాపూర్ ఎక్స్ రోడ్డు వరకు ఉన్న వివిధ గ్రామాల కిరాణా దుకాణాలు,హోటళ్లు పూర్తిగా మూత పడ్డాయి.భారీ వాహనాలకు రవాణా అనుమతులు ఇవ్వడం తో తిరిగి పూర్వ వైభవం వస్తుందని చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.