District level Khel Khud: ముధోల్, జనవరి 4 (మన బలగం): సరస్వతి శిశు మందిరాలతో సంస్కారవంతమైన విద్య అందుతుందని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శనివారం భైంసాలోని సరస్వతి శిశుమందిర్ సుభద్ర వాటికలో జిల్లా స్థాయి ఖేల్ ఖుద్ పోటీలను ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడారు. 1967 నుంచి నిర్మల్ జిల్లా నుంచి సరస్వతి శిశు మందిరాలు ప్రారంభమై నేడు రాష్ట్రమంతా పాఠశాలలు వెలిసి వేలాది మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారన్నారు. దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్ శిశు మందిరాలకు విశిష్ట సేవలు అందించాలని ఈ సేవలను ఇక్కడ ప్రాంతవాసులు ఎన్నటికీ మర్చిపోరన్నారు. తమ తల్లి స్మారకర్థం కోట్లాది రూపాయల విలువైన భూమి శిశు మందిరాలకు ఇవ్వడం ఆయన సేవకు నిదర్శనమన్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఆటల పోటీల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. శిశు మందిర్ అభివృద్ధికి తమవంతుగా పాటుపడతామని అన్నారు. భవన, ప్రహరీ గోడ నిర్మాణానికి తమ వంతుగా నిధులు ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం క్రీడాజ్యోతి వెలిగించి, పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యాపీఠం ఆదిలాబాద్ విభాగ్ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రెడ్డి, పూర్వ విద్యార్థి పరిషత్ అధ్యక్షులు హరిస్మరణ్ రెడ్డి, మండల విద్యాధికారి సుభాష్, రమేశ్ మాశెట్టి వార్ తదితరులు పాల్గొన్నారు.
