- మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్న దేశ ప్రజలు
- తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
Alleti Maheshwar Reddy: నిర్మల్, ఫిబ్రవరి 8 (మన బలగం): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని బలపరిస్తున్నారని, ఈ ఎన్నికలలో స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. రోజు రోజుకూ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందని అన్నారు. గతంలో ఆప్ పార్టీ తప్పుడు హామీలతో, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడంతో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, స్వచ్ఛమైన సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. గతంలో తెలంగాణలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పట్ల ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా గద్దె దించారో, ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు అలాంటి తీర్పే ఇచ్చారని, రాబోవు రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పాలన మాదిరిగానే కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో రాబోయేది రామ రాజ్యమే అని ఎమ్మెల్యే అన్నారు. ఏడాది పాలనలోనే ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు.