నిర్మల గురుకులంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు
National Girl’s Day: ఎల్లారెడ్డిపేట, జనవరి 24 (మన బలగం): లింగ వివక్షతను అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన లాంటి వినూత్న పథకాలు ప్రవేశ పెట్టిందని, దీన్ని తెలంగాణ ప్రభుత్వం సైతం పటిష్టంగా అమలు చేస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం అన్నారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గంభీరావుపేట్ మండలంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల- కళాశాల నర్మాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాను సారం బాలికల కోసం కాస్మోటిక్ చార్జీలు, మెస్ చార్జీలు పెంచినట్లు తెలిపారు. ప్రతి హాస్టల్కు స్పెషల్ ఆఫీసర్ను కేటాయించి ఆహారం మంచి నాణ్యమైన ఆహారం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని రకాల పాఠశాలలో ఒకే రకమైన నూతన భోజన పట్టిక- డైట్ మెనూ ప్రకటించారని తెలిపారు. పోషకాహారం ప్రాముఖ్యతను గుర్తించి విద్యార్థులకు నెయ్యి, చికెన్, మటన్ అలాగే వెజిటేబుల్ సంబంధించిన వాటితో కూడిన భోజనాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దానికి అనుగుణంగా డైట్ చార్జీలను కూడా పెంచినట్లు చెప్పారు.
అలాగే మహిళల భద్రత కోసం బాలికల భద్రత కోసం నిరంతరం షీ టీంలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయన్నారు. అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు సహా బాలికలు మహిళల సంరక్షణ కోసం అనేక పథకాలు ప్రకటించిందన్నారు. గృహజ్యోతి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు ఇలా ప్రతి పథకంలో మహిళా భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తూ వాటన్నింటిలో ఉపాధ్యాయుల నియామకం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాలికలు, మహిళలు ఆపద సమాయాల్లో 24 గంటలు ఉచితంగా మహిళా శిశు సంక్షేమ శాఖ టోల్ ఫ్రీ నెంబర్స్ అయినా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181 తక్షణమే సహాయాన్ని అందిస్తాయని తెలిపారు. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థినులకు బహుమతులు అందించారు. ఎందరో మహిళలు ఆదర్శవంతంగా అనేక రంగాలలో కృషిచేసి సమాజం అభ్యున్నతికి తోడ్పడుతున్నారని మహిళల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సీడీపీవో ఉమారాణి, ప్రిన్సిపల్ సృజన, డిహబ్ కోఆర్డినేటర్ రోజా, సిబ్బంది దేవిక, రమ్య, సఖీ సిబ్బంది, ఐసిడిఎస్ సూపర్వైజర్ రేణుక, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.