- లెఫ్ట్ పోచంపాడ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తనిఖీ
- పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని సిబ్బందికి ఆదేశాలు
- క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ పరీక్షలకు సన్నద్ధం కండి
Nirmal Collector Abhilasha Abhinav: నిర్మల్, ఫిబ్రవరి 17 (మన బలగం): విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదిలో విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. గణితం సబ్జెక్టుకు సంబంధించి లెక్కలను విద్యార్థులచే చేయించారు. పరీక్షలు సమీపిస్తున్నందున ఉన్న సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటూ పరీక్షలకు సిద్ధంకావాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. సిలబస్ను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూ ఒత్తిడి లేకుండా చదవాలన్నారు. విద్యార్థులందరూ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పదిలో పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని విద్యార్థులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. సబ్జెక్టుల్లో ఎటువంటి సందేహాలు ఉన్నా ఆయా ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్, అదనపు కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. ప్రతి రోజు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి.రామారావు, కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి, తహసిల్దార్ మల్లేష్, ఎంపీడీవో సురేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
